(గత శేషం)
ఈ రోజు త్రివిధ భక్తి గురించి తెలుసుకుందాం.
1. బాహ్య భక్తి: ఎవరైన తనకు నచ్చిన భగవద్రూపాన్ని ఎంచుకుని చక్కని ప్రదేశంలో ఆ మూర్తిని శక్త్యానుసారం అర్చించుకోవడం అన్నమాట. మన ఇళ్ళల్లో పూజ గదులు మన దేవాలయాలు ఈ బాహ్య భక్తి కేంద్రాలుగా భావించాలి. ఈ బాహ్య భక్తి లౌకిక సాంసారిక సామాజిక యిబ్బందులను అధిగమించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. భక్తి మార్గంలో ఇది తొలి మెట్టు.
ఇందులో ఉదయాస్తమాన పూజలు కైంకర్యాలు సుప్రభాతాలు ఏకాంత సేవలు వగైరా లన్నీ రకరకాలుగా భక్తునికి తదాత్మ్యతను తీసుకుని రావడానికి ఇష్ట కామ్య సిద్ధికి ఉపయుక్తంగా ఉంటాయి.
2. అనన్య భక్తి:
భగవద్గీత 9/22 వ శ్లోకం ఈ విషయాన్ని బాగా వివరిస్తుంది. అది
అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే
తేషాభి యుక్తానాం
యోగ క్షేమం వహామ్యహం.
స్థూల దృష్టి తో కాకుండా సూక్ష్మ దృష్టి తో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది.
ఎవరైతే త్రికరణ శుద్ధి గా తనను నమ్మతారో వారి యోగక్షేమాలను నేను చూసుకుంటా అనే అభయం అది. అది ఒక భరోసా. అది ఒక భీమా పోలసీ.
దీనికి కొందరు కృష్ణుణ్ణి మాత్రమే నమ్ముకుంటేనే ఈ పోలసీ వర్తిస్తుంది. లేని వారికి కాదు అని అంటూంటారు. నిజానికి అది అసంబద్ధం. ఎలాగనంటే
'ఏకం సత్ విప్రా బహుదా వదంతి' అని శృతి ప్రమాణం.
భక్తుడు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలోనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అందుకే పోతన గారు
నమ్మితి నా మనమ్మున సనాతనులైన యుమా మహేశులన్.... అని
నిన్ నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అని
...పురాణింపన్ దొరన్ కొంటి మేల్
పట్టున్ మానకుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.
అని చెబుతూ గీతాచార్యుల భరోసానూ గుర్తు చేస్తారు.
...నీవే తప్ప యితః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా.
అంచేత అనన్యాశ్చింతయంతో మాం అన్నదానికి త్రిశుద్ధిగా నమ్మడం అనే చెప్పుకోవాలి. అది ఒక శరణాగతి. శరణని వేడుకున్న ఏప్రాణినీ శత్రువైనా సరే హింసించ రాదు అనేది స్థావర జంగమాలన్నిటికీ వర్తిస్తుంది.
రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి అనుకుందాం. అందులో ఒక కుక్క తోకను కిందకు చాపి తలవంచి నిలబడితే సింహంలా పోరాడే రెండో శునకం అరుస్తూ ఆగిపోతుందే కాని హాని చేయదు. అది సృష్టి ధర్మం.
బాహ్యపూజలోని ఉపచారలన్నింటిలోను ప్రదక్షిణ చాలా విలువైనది. అదే శరణాగతి.
' అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరః/జనార్థనః.' అని మంత్రం.
మనం ఎవరికైనా గౌరవంగా ఏదైనా యిస్తే దాన్ని దక్షిణ అంటాం. అది కూడా చాలా గొప్పది కనుక ప్రదక్షిణ అయింది. ఆ ప్రదక్షిణలో మనం శరణాగతి వేడుకుంటాం.
శరణన్న వానిని కాపాడడం సృష్టి ధర్మం.
ఆ శరణాగతిలో ప్రస్ఫుటించేదే అనన్య భక్తి.
ఏకాంత భక్తి:
భక్తి యొక్క ఉన్మత్త స్థితి అని చెప్పు కోవచ్చు. సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సు భగవంతుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో ఎవరితోటీ కలియాలనిగాని మాటాడాలనిగానీ అనిపించదు. దీనికి ఉదాహరణగా ప్రహ్లాదుడు జడభరతుడు లను చెప్పుకోవచ్చు.
నమ్రత, నిష్కపటత్వం, అహింస, క్షమ , సరళత , గురుసేవ , శౌచరాహిత్యం , స్థిర చిత్తం , ఆత్మ నిగ్రహం ,నిరహంకారం , నిరపేక్ష మరియు రాగ బంధాలకు అతీతంగా ఉండడం అనే లక్షణాలు క్రమేపీ అలవడి మనస్సు లక్ష్యం పైన మాత్రమే నిలపడం జరుగుతుంది. అవధూత లక్షణాలు ఇలాగే ఉంటాయి. బాహ్య ప్రపంచ విస్మృతితో సదా భగవత్సన్నధిలో మనసు లయం అవుతుంది. ఎంత మందిలో ఉన్నా ఏకాంతం వీడలేరు. అదే ఏకాంత భక్తిగా భావించాలి.
నవవిధ భక్తి రేపు చూద్దాం. (సశేషం)