Sunday, May 10, 2020

            అమ్మ
ఎవరి అమ్మ వారికి బ్రహ్మే.
అమ్మతో కొన్ని సంఘటనలు మరచిపోలేని తీపి గురుతులు.
నేను పుట్టిన పదినెలలప్పడు వంటి నిండా కురుపులు. రసి కారేవి. ఎవరు ఎత్తుకుంటే వారికీ వచ్చేసేవి. మాతామహుల ఇంట ఆయుర్వేద వైద్యం. మంచి గుర్తింపుతో నడిచేది. అయినా ఓ సంవత్సరం పైనే ఆ కురుపులతో ఇబ్బంది పడ్డా. నాకు బాగా గుర్తు . రావికమతంలో తాతగారి ఇంటి పక్కనే ఆసుపత్రి. మామయ్య ఆయుర్వేద భిషక్ మరియు ఆర.ఎం.పి.
అక్కడకి ఓ సాయంత్రం వెళ్ళాను. మామయ్య ఇంజక్షన్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఏడుస్తూ ఇంటికి పరిగెత్తా. అమ్మ ఎత్తుకుని సముదాయించింది. ఆ పరుగెత్తే సీన్ ఇంకా గురుతుంది. ఆ తరువాత ఎప్పుడో మా కలకత్తా దొడ్డ సల్ఫాన్ మేన్ పౌడరు కొబ్బరినూనె కలిపి రాయించింది. మూడురోజుల్లో కురుపులన్నీ మాయం.
రోజూ నిద్రపోయేటప్పుడు అమ్మ ఏవో కథలు చెప్పేది. ఆ తరువాత "వద్దురా పోవద్దురా  రద్దులు మనకొద్దురా" అన్న పాట పాడాకే నిద్ర.
మూడేళ్ళప్పుడు నాన్నగారి తో పచార్లు తిరుగుతూ నేర్చుకున్న కృష్ణ శతకం పద్యాలు అమ్మ అప్పచెప్పించుకునేది. అప్పుడే ఓ సారి మా అక్క పావడా నీలిరంగుది వేసి జాకెట్టు వేసి బడికి పంపింది నాన్నగారి దగ్గరకు. అందరూ మా అక్కే అనుకున్నారు. ఒక్క సారి నాన్నగారికి కనిపించి ఇంటికి పరుగో పరుగు. ఆ పరుగూ ఆ డ్రస్సూ ఇంకా గురుతే.
అక్షరాభ్యాసం అయ్యాక ఓ రోజు ఎండలో ఇసక పోసి అఆఇఈలు దిద్దిస్తోంది అమ్మ. ఇంతలో నాన్నగారు బడినుంచి వచ్చారు. అమ్మని కసురుకున్నారు. ఆ ఎండలో అక్షరాలు దిద్దడం ఇంకా గురుతే. అప్పుడు అక్షరాలు సుద్దముక్కతో అరుగు మీద వ్రాసి చింత పిక్కలు పేర్పించేవారు. ఆ తరువాత అక్షరాలు రాసి ఇవ్వకుండా నే చింతపిక్కలు పేర్చమనేవారు. మొత్తానికి ఆ రకంగా అక్షరాలు నేర్చుకున్నా.
ఒక సంవత్సరం లోనే ఒకటి రెండో తరగతులు అయిపోయాయి. మరుసటేడు. మూడు నాలుగూ అవగొట్టేసా. అన్నీ ఇంటి దగ్గరే. అమ్మ దగ్గరే. అయిదో తరగతి పూర్తిగా ఓ సంవత్సరం బడికి వెళ్ళి చదివా.
మాకు దగ్గరలో హైస్కూలు లేక మా అన్నయ్య తాతగారింట ఉండి చదువుకోవడానికి ఏర్పాటు చేస్తే వాడికి టైఫాయిడ్ వచ్చి ఇంటికి వచ్ఛేసాడు.
1963 వేసవి శలవుులకు కోటనందూరులో కాపురం. నేమాని వారింట వసతి. ఇంటూ. ఫస్ట్ ఫారం పరీక్ష కి తయారవడం. ఆ ఎత్తరుగుల మీద కూర్చుని చదువుకోవడం ఇంకా గురుతే.
అప్పటికి నాకు తొమ్మిది సంవత్సరాల వయసు.
నేను మా అక్క మా అన్న ముగ్గురం ఆరో తరగతిలో చేరాం. ఆప్పటికి నాకు
భాగవతంలో పద్యాలు మా అమ్మ చాలా నేర్పింది. ఏ పద్యం అడిగినా చెప్పాలి. అదే ఆట నాకు.
కార్తీకమాసం లో తెల్లవారుజామున ఏటికి స్నానికి నలుగురైదుగురు ఆడవాళ్లు మా అమ్మ. కలిసి వెళ్ళేవారు. లాంతరు పట్టుకుని తోడు వెళ్ళడడం నా డ్యూటీ. వాళ్ళ పని అయిపోగానే నేనూ స్నానం చేసి ఓ దీపం నీటిలో వదిలి ఇంటికి రావడం. అలా ఆరేళ్ళు చేసా.
తొమ్మిదో తరగతిలోకి వచ్చేసరికి రోజూ స్నానం చేసాక అమ్మతో కలిసి పే..ద్ద గొంతుపెట్టి వేంకటేశ్వర సుప్రభాతం మంగళ హారతి చదివే వాడిని.
వంటల్లో కూడా ఆమ్మ నన్నే పిలిచేది. మడి వంటకి ఆడపిల్లలు తడిబట్టలతో ఉండలేరని. నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఓ సారి వినాయక చవితికి తుని వచ్చిం బొంబాయి నుంచి. ఆ రోజూ నేనే. మడికట్టుకుని వంట లో సాయం చేసా అమ్మకు.
అలా అమ్మతో ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు జ్ఞాపకాలు.
అలా నన్ను తీర్చి దిద్దిన మాతృమూర్తికి జేజేలు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home