"ఒరేయ్ శంకరం, రిటైరయ్యాక ఎక్కడ ఉంటావో తేల్చుకున్నావా?" అడిగాడు పెద్దన్న.
"బహుశా మన ఊర్లో"
"వద్దురా. మునుపటి మనుషులు కాదు. నిజాయితీ తగ్గిపోయింది. ఇబ్బంది పడగలవు. మరోసారి ఆలోచించుకో" పెద్దన్న హెచ్చరిక.
అయినా అటే నడిచి చతికిల పడ్డ శంకరం.
ఆకాశం బున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి పయోధి నుండి పవనాంధో లోకమున్ జేరె గం
గా కూలంకుష పెక్కు భంగుల వివేక భ్రష్ట సంపాతముల్.
వాలు కుర్చీలో శంకరం ఈమధ్య తరచుగా పాడుకుంటున్న పద్యం.
"ఏవండీ ఎందుకు అలా డీలా పడిపోతారు?"
"జననీ జన్మ భూమిశ్చ.. అని జన్మభూమి ఋణం తీర్చు కోవాలను కున్నారు. మీ ఆశయం గొప్పది. భగవంతుడు మీకు సహకరిస్తాడు" అంది శారద.
శంకరం ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నతమైన ఉద్యోగం చేసి రిటైరై ఐదేళ్లు కావస్తోంది.
శంకరం పుట్టిపెరిగింది విశాఖ జిల్లాలో ఓ కుగ్రామం.
ఆ తరువాత స్వయం కృషితో సి.ఏ. చదువుకుని నేరుగా ఓ మంచి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. అతనికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం.
అతను ఢిల్లీలో పనిచేసే నాటికి వాళ్ళ కుటుంబం తుని తరలిపోయారు. స్థిరాస్థులేమీ లేవక్కడ.
తను ఇంటికి తుని వస్తే ఒకసారి పల్లె కు వెళ్ళి అందరినీ చూసి వచ్చేవాడు.
వారికి ఒక అబ్బాయి ఓ అమ్మాయి. పెళ్ళిళ్ళు ఐపోయాయి. అంతా బాగానే ఉన్నారు.
రిటైర్ అవగానే పల్లె కు మకాం మార్చేసాడు శంకరం.
తన ప్రజలకి మంచి చేయాలి అనే తపన.
రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరో ఒకరు వచ్చి పోతూండేవారు.
" బాబూ! శంకరం బాబూ నువ్వే ఎలాగన్నా కాపాడాలి. చిన్నప్పుడు ఎత్తుకు మోసాను. కాబూలీ వాడి దగ్గర అప్పు తీసుకుని వాయిదా కట్ట లేదని గొడవ. నీకు పున్నెముంటాది. ఓ పదివేలు అప్పిస్తే ఆడి మోహాన కొడతా బాబ్బాబు" అంటూ మూలయ్య కాళ్ళా వేళ్ళా పడ్డాడు.
నిజమే ఎత్తుకుని తిప్పేవాడు చిన్నప్పుడు అని పదివేలు ఇచ్చాడు.
అలాగే మరొకరు మరొకరు. ఎవరినీ కాదనలేని మొహమాటం.
ప్రెసిడెంట్ నాగేష్ ఓ మూడు లక్షలు చేబదులుగా పచ్చుకుని మూడేళ్ళయింది.
ఎవ్వరూ వెనక్కి ఇవ్వరు. గట్టిగా అడగ లేడు.
ఓ పదెకరాల భూమి తనఖాకి తీసుకుని ఆర్గానిక్ వ్యవసాయం డెయిరీ మొదలు పెట్టాడు.
మొదట్లో అన్నీ బాగానే నడిచేవి. క్రమేపీ పనివాళ్ళ దురాలోచనలు ఎక్కువై డెయిరీ నష్టాల్లో నడవడం మొదలైంది.
మిగిలిన వ్యవసాయం కిట్టబాటు కావడం లేదు.
ఇంతలో ఓ ప్రైవేటు స్కూల్ పెట్టాడు. మంచి భవనం అన్ని సదుపాయాలు కల్పించాడు. ఓ ఇరవై మందికి ఉపాధి ఇచ్చాడు.
అక్కడా ఫీజులు ఎవరూ సక్రమంగా కట్టరు. గట్టిగా అడగలేడు. జీతాలు ఇచ్చుకోవాలి.
ఊరిలో పదిమందికి గేదెలు కొని ఇచ్చాడు పాలమీద వచ్చిన డబ్బులో సగం చొప్పున మూడు సంవత్సరాలు కడితే బాకీ తీరి పోతుంది.
మధ్యలోనే గేదెలు అమ్మేసుకుని తొంటి చెయ్యి చూపించారు.
కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది అతని పరిస్థితి.
శారద ఏమీ అనకున్నా ముప్పైఅయిదు సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ ఓటమి ఎరుగరు. కూడబెట్టిన డబ్బు అంతా ఇలా ఇరుక్కు పోయింది. గుడ్డిలో మెల్ల పిల్లల పెళ్ళిళ్ళు ఐపోయి సుఖంగా ఉన్నారు.
శంకరం కొడుకు గిరీశం చాలా మంచివాడు. "నాన్నా పోతేపోయిన డబ్బు వచ్చేయండి నాన్నా ముంబై. ఇక్కడే హాయిగా ఉండొచ్చు."
కాని శంకరానికి మనసు ఒప్పలేదు.
అలాగని ముందుకు సాగలేడు. వెనక్కి తగ్గలేడు.
హత విధీ! ఎంత అవివేకం. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
ఆహా త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళమీద ఉన్నప్పుడు నిజమేనేమో.
శ్రీరామచంద్రుడికి అలా అనిపించిందీ అంటే మానవతా విలువల పైన జీవనం సాగేది. మరి ఇప్పుడు మాత్రం ఆ మాట సత్యదూరమే.
ప్రతిదీ ఉచితానికి అలవాటు పడ్డ జనంలో నిజాయితీ మాయమైంది. స్వార్థం ఎక్కువైంది. బుద్ధి చెప్పేవారు లేరు.
శంకరం శారదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించడం వినా మార్గాంతరం లేదు.
శంకరంకి ఇప్పుడు బాగా అర్థమైంది పల్లెటూర్లు ఎందుకు అభివృద్ధి సాధించలేక పోతున్నాయో. అలాగే అన్నదాతకు అప్పు కూడా ఎందుకు పుట్టదో బాగా తెలిసొచ్చింది.
కానీ అతని పరిస్థితి ని చక్కదిద్దడం ఎలా?
కోరి తెచ్చుకున్న కష్టాలు. పెద్దన్న మాటను కాదని వెళ్ళి బోర్లా పడ్డాడు శంకరం.
అపిస్వర్గమయీం లంకా
నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ.
దీనికి భాష్యం .యాంటీ క్లైమాక్స్ లోనా?
ఊహలకందని ఫక్తు నిజం. జయహో నా గ్రామసీమ.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home