Thursday, April 4, 2019

         వేసవి శలవులు


 వేసవి శలవులంటే చీకూ చింతా లేకుండా ఆటపాటలతో గడిపేయడమే. పల్లెటూర్లలో సందడే వేరు. ఒక ఈడు వారు అందరూ కలిసి రాత్రి పగలూ అనకుండా తిరిగే అవకాశం.
మాది మారుమూల ఓ చిన్న పల్లెటూరు. దానికి అప్పట్లో రోడ్డు కూడాలేదు. హైస్కూల్ 4 కి.మీ. దూరంలో ఒకటి 8 కి.మీ. దూరంలో ఒకటీ 24 కి.మీ. దూరంలో ఒకటి ఉండేవి. అన్నిటికన్నా దూరం అయినా శంఖవరం లో ఎక్కువ మంది చదివేవారు. కారణం రాజా వారి సత్రంలో వసతి , భోజనం కొందరికి ఉచితం. మా వూరినుంచి కనీసం పదిహేను మంది వరకూ అక్కడే చదివేవారు.
మరి కొందరు  దగ్గరలో ఉన్న గునుపూడి లో చదువు కోసం రోజూ నడిచి 4కి.మీ. వెళ్ళి వచ్చేవారు. మేము మాత్రం కోటనందూరులో చదివాం. మా అమ్మ పిల్లలం అక్కడ మా నాన్నగారు మా వూర్లో. వారం వారం వచ్చి వెళ్ళేవారు.
వేసవి శలవులకు అందరం మా వూరు చేరుకునే వాళ్ళం.
ఇంకేముంది. తిండికి మాత్రమే ఇళ్ళకు. మిగతా సమయం అంతా కలిసి ఒకచోటే గడిపే వాళ్ళం.
ఉదయం తొమ్మిది తరువాత కఱ్ఱ బిళ్ళ ఆట వూరికి ఓ ఎంట్రన్స లో. ఆ ఆటలో ఆడే వాళ్ళ కన్నా చూసేవారే ఎక్కువ. మంచి కత్తెర ఎండల్లో ఆట మహా గొప్పగా ఉండేది. పక్కనే చింతచెట్ల నీడన చిన్నవారం ఆడుకునేవాళ్ళం.
మధ్యలో మామిడి పిందెలు కోసి తెచ్చుకోవడం, ఉప్పు కారం అద్దుకుని తినడం బలే మజాగా ఉండేది.
మద్యాహ్నం పన్నెండు అయ్యేసరికి ఇంటికి వచ్చేసి మధుమంజరి పాటలు రేడియో లో వింటూ భోజనాలు.
ఆ వెంటనే వార్తలు.
మరలా ఒంటిగంటకి కూటమిలోకి చేరిపోయి పిచ్చాపాటీ.
అక్కడ ఒకరి ఇంటి వీధి గుమ్మం మా అందరికీ ఆవాసం. ఆ ఇంటివారు పెరటి వేపు ఉండేవారు. అక్కడే పంచాయతీ రేడియో ఉండేది. అదే అందరికీ కాలక్షేపం.
పంచాయతీ ఆఫీసుకు రెండు తలుపులు. క్రింద ఒకటి మీద ఒకటి. మీద తలుపు కొంచెం తేల్చి కింద తలుపు గడియ తీసి ఆ రేడియో ఆన్ చేసి  వినే వాళ్ళం. ఇంతలో ప్రెసిడెంట్ వచ్చి ఎవరు వేసారు రేడియో అని అడిగితే మాకు తెలీదంటే మాకు తెలీదని తప్పించుకునే వాళ్ళం. సూరెంటు యెదవలు అని ఆ రేడియో కట్టేసి పోయేవాడు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో  చుట్టుపక్కల ఉన్న ఏదో ఓ పొలంలో ఉన్న నేలనూతికి వెళ్లి స్నానాలు. నేల నుయ్యి ఇరవై అడుగులు వ్యాసంతో నేల నుంచి ఐదారడుగుల కిందకు నీరుండేది. లోతు ఎంతకాదన్నా ఇరవై ఐదడుగుల వరకూ ఉంటుంది. అందులో ఈతలు దూకడాలు నూతిలో ఎదో ఓటి పడేస్తే కింద వరకూ వెళ్ళి వెతికి తీసుకు రావడం. జట్టు పదిహేను ఇరవైమంది. అందరికీ ఈత వచ్చేసింది.
ఇక రాత్రి అంతా ఒక దగ్గరే బిచాణా. ఒకరి బోడిమేడ మా అందరికీ ఆశ్రయం. దానికి సగంమేర మాత్రమే మెట్లుండేవి. ఆపైన గోడ అంచు పట్టుకుని గోడకు రెండు చిన్న కన్నాలుండేవి అందులో కాలేసి ఎక్కాలి. పిట్టగోడలు కూడా లేని ఆ మేడమీద ఆకాశం చూసుకుంటూ బాతాఖానీ.
అయితే ఈ గుంపులో ఒకరిమీద ఓకరికి ఈర్ష్య ద్వేషం ఉండేవి కాదు. అందరిదీ ఒకటే మాట.
ఆందుకే ఆ వేసవి శలవులు అయ్యాక బడి అంటే రోత.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home