Wednesday, April 19, 2017

నాగరీకం ముదిరిందా


వనములెన్నో భవనమ్ములుగా మారిపోయాక
వసతులెన్నో వసుంధర కోల్పోయాక
నగరాలలో కనరావు వసంతుని నగారాలు
కోవెల కుహుకుహూ రాగాలు పంచమ స్వరాలు
గతస్మృతులుగా మనసులు నింపుకుని
ప్రగతి పథగమన భ్రమైక పథంలో పయనిస్తూ
ప్రకృతి ని శాసిస్తూ జనం
జనాళిని శపిస్తూ ప్రకృతి
పట్టు కోసం పట్టుకు ఛస్తుంటే
సహజ సౌందర్య మహి మహిమ లెక్కడ
రమణీయ ప్రకృతి కాంత రాశీ రూప మెక్కడ
అయాచితంగా వచ్చిన వనరులన్నీ
అనాలోచితంగా నాశనం చేస్తుంటే
విలయ వలయాలు అనల పవనాలూ
మహోగ్ర సూర్య కిరణాలూ సర్వ సాధారణాలు
ప్రాణవాయువును కూడా కొనుక్కోవాలేమో
నీటికి ఎద్దడి , దాహం తీర్చే నాథుడు ఏడీ?
మిన్నేటి పన్నీటిని గతి మార్చి ఏమార్చి
భువి బాట పట్టించి పృథ్వీ లలామను స్నానమాడింపించే భగీరథులేరీ
పంట కరవై పాడి బరువై రైతు గుండె చెరువై
నీతిమాలిన జాతిహీనత మనదా?
నాగరీకం ముదిరిందా? నడిరోడ్డున పడిందా? 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home